LATEST UPDATES

Tuesday, March 5, 2024

రాగి లో అగ్గి తెగులు


అగ్గితెగులు రాగి పంటకు మూడు దశలలో సోకుతుంది. 
          నారుమడి దశలో సోకినట్లయితే మొక్కలు ఎండిపోతాయి. 
        ఎదిగిన మొక్కల ఆకులపై చిన్న చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి నూలు కండె ఆకారంలోకి మారుతాయి. మచ్చల అంచులు ముదురు గోధుమ రంగులో ఉండి మధ్య భాగం బూడిద రంగులో కనబడుతుంది. తెగులు పెరిగేకొద్దీ ఆకులు ఎండిపోయి పంట మొత్తం కాలిపోయినట్లు కనిపిస్తుంది అందువల్ల ఈ తెగులును "అగ్గితెగులు" అని పేరుతో పిలుస్తారు. కణుపుల మీద కూడా ఈ వ్యాధి నలుపు రంగు మచ్చలు రూపంలో కనిపిస్తుంది. 
         ఈ తెగులు కంకుల మెడభాగంపై ఆశించినపుడు నష్టం అధికంగా ఉంటుంది. తెగులు ఆశించిన భాగంలో కణజాలం నల్లగా మారి కుళ్లిపోవటం వళ్ళ వెన్నుల మెడవద్ద విరిగి క్రిందికి వాలిపోతాయి. ఫలితంగా వెన్ను భాగానికి ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయి తాలుగింజలు ఏర్పడతాయి. తెగులు వెన్నులపై ఆశించినపుడు రెక్కలు నల్లగా మారి గింజ కట్టకుండా ఉండిపోతాయి. 


నివారణా చర్యలు: 
          తెగులు తట్టుకొనే రకాలయిన శ్రీచైతన్య, వేదావతి, ఇంద్రావతి, సువర్ణముఖి, వకుళ మరియు తిరుమల రకాలను ఎన్నుకోవాలి. సిలీన్ద్రం కలుపు మొక్కలపై జీవిస్తుంది కాబట్టి పొలంగట్లపై మరియు పొలంలో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. నత్రజని ఎరువులను సిఫారసులకు మించి వాడరాదు. నారు నాటేముందు బ్లెయితకేస్ లేదా మాంకోజాబ్ మందును మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. 
           నారుమడిలో మొక్కలు పసుపు రంగుకు మారి గుంపులుగా ఎండిపోతుంటే వెంటనే లీటరు నీటికి కార్బండిజమ్ 1 గ్రాము కలిపి నారుమడిపైన వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. మొక్కలపై అక్కడక్కడా మచ్చలు కనిపించినప్పుడు లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్ లేదా ట్రీసైక్లోజొల్ మందును కలిపి 15రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

Sunday, January 14, 2024

అండుకొర్రల సాగు విధానం

          ప్రస్తుతం మారుతున్న జీవన శైలిలో చిన్న వయస్సు నుండే మధుమేహం, గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చిరుధాన్యాలతో ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని వీటి ప్రత్యేకతను గుర్తించి వీటి సాగుపై మొగ్గు చూపుతున్నారు. 
          ఈ చిరుధాన్యాలలో అరుదైనవి అండుకొర్రలు (Brown Top Millets). అధిక ఉష్ణోగ్రతలను, బెట్ట పరిస్థితులను తట్టుకొని సారంలేని నేలలోనూ ఆశించినంత దిగుబడులను పొందుతుండటంతో మెట్ట ప్రాంత రైతులు అండుకొర్రలు సాగుచేస్తున్నారు. 
          అండుకొర్రలు సంపూర్ణ సమతుల్య పోషక విలువలతో పాటు రుచిలోనూ అద్భుతంగా ఉంటాయి. ఇవి గ్లూటిన్ రహితంగా అధిక పీచు పదార్ధం (12%) కలిగి ఉంటాయి. కొంతకాలం ముందు వీటిని పశుగ్రాసంగా అధికంగా సాగుచేసేవారు. ఇటీవల కాలంలో దీని ప్రాముఖ్యత పెరిగి చిరుధాన్య పంటగా రైతులు సాగు చేస్తున్నారు. 

సాగు వివరాలు:
          విత్తనం నాటడానికి ముందు కల్టివేటర్ తో సన్నటి దుక్కి చేసుకోవడం వలన భూమిలో తేమ శాతం నిలుపుకోవడంతో పాటు మొలక శాతం పెరుగుతుంది. అండుకొర్రలను ప్రధాన పంటగాను, మిశ్రమ పంటగాను సాగుచేసుకోవచ్చు. ఆగస్టు మధ్య వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకోవటం వల్ల దిగుబడి తగ్గే అవకాశముంది. ముందుగా విత్తుకోవడం వల్ల మొవ్వ ఈగ నుండి రక్షణ పొందవచ్చు. ఎకరానికి 6-7 క్వింటాళ్ల గింజ దిగుబడితో పాటు 4 ట్రాక్టర్లకు సరిపడా పశుగ్రాసం పొందవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) వారు ప్రాసెసింగ్ యంత్రాలపై అవగాహన మరియు శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నారు.

Tuesday, January 9, 2024

పసుపు లో దుంపకుళ్ళు తెగులు వాటి యాజమాన్యం

          విత్తన శుద్ధి చేయని కొమ్మలను నాటుకోవటం, మురుగునీటి పారుదల సరిగా లేకపోవటం, ఎడతెరపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండడం, సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించకపోవడం, వేపపిండి, పొటాష్ సక్రమంగా వాడకపోవటం వల్ల ఈ తెగులు ఆశించటానికి ప్రధాన కారణం. 
          ఈ తెగులు ఆశించినప్పుడు ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమరంగుకు మారి ఎండిపోతాయి. తరువాత లేత ఆకులకు ఈ తెగులు వ్యాపిస్తుంది. తల్లి, పిల్ల దుంపలు కుళ్లి మెత్తబడి, చెడు వాసన వస్తాయి. 
నివారణ చర్యలు: 
          ఆరోగ్యమైన తెగులు సోకని దుంపలను నాటుకోవటానికి విత్తనంగా ఎన్నుకోవాలి. దుంపలు నాటుకోవడానికి ముందు 5 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి పొడిని లీటరు నీటికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని, నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక అడుగు ఎత్తు, ఒక మీటరు వెడల్పు కలిగిన ఎత్తైన మడులను ఏర్పరుచుకొని దుంపలను నాటుకోవాలి. ఒక కిలో ట్రైకోడెర్మాను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి వారం రోజులపాటు అనువైన పద్దతిలో వృద్ధి చేసి ఆఖరు దుక్కిలో లేదా నెలరోజులకు మొదటిసారిగా కలుపు తీసాక తడి ఇచ్చిన వెంటనే వేసుకోవాలి. 
           పైన చెప్పిన పద్ధతులు పాటించినట్లయితే తెగులు ఉధృతిని తగ్గించవచ్చు.


అల్లం లో దుంపకుళ్ళు తెగులు వాటి యాజమాన్యం

         అల్లం దుంప జాతి, ఔషధ మొక్క మరియు సుగంధద్రవ్యం గాను ఉపయోగిస్తారు. అల్లంలో దుంపకుళ్ళు తెగులు అధిక నష్టాన్ని కలుగచేసి దిగుబడి తగ్గిస్తోంది. మురుగునీటి కాలువలు లేకపోతె దుంపకుళ్ళు సమస్య ఎక్కువవుతుంది. ఎక్కువ వర్షపాతం, నీరు నిలిచే పరిస్థితులలో శిలీంద్రం వేగంగా అభివృద్ధి చెంది ఈ తెగులును తీవ్రంగా వ్యాపింపచేస్తుంది. భూమిలో కొమ్ములపై ఈ వ్యాధికారక శిలీంద్రాలు జీవించి ఉండి నీటి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించిన దుంపలు మెత్తగా అయ్యి చర్మం వదులుగా ఉండి ఊడివస్తుంది. తెగులు ఉదృతి ఎక్కువైనప్పుడు మొక్కలు ఎండి పడిపోతాయి. దుంపలు నిల్వ ఉంచినప్పుడు కూడా తెగులు ఉధృతి పెరిగి దుంపలు కుళ్లి పోతాయి. 
నివారణ చర్యలు: 
          ఆరోగ్యమైన తెగులు సోకని దుంపలను నాటుకోవటానికి విత్తనంగా ఎన్నుకోవాలి. దుంపలు నాటుకోవడానికి ముందు 5-7 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి పొడి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మురుగునీటి కాల్వలు ఏర్పరచుకొని పొలంలో నీరు నిల్వ ఉండకుండా, కలుపు లేకుండా చూసుకోవాలి. ఒక అడుగు ఎత్తు, ఒక మీటరు వెడల్పు కలిగిన ఎత్తైన మడులను ఏర్పరుచుకొని దుంపలను నాటుకోవాలి. దుంపకుళ్ళు సోకిన మొక్కలను తీసివేసి కాల్చివేయాలి. తెగులు ఉదృతమైనప్పుడు మొక్కజొన్న, రాగి (లేదా) పప్పు ధాన్యాలతో పంట మార్పిడి చేసుకోవాలి. 
          సరైన ఎరువుల యాజమాన్యం పాటించాలి. వేపపిండి ఎరువును వేసుకోవాలి. తెగులు సోకిన మొక్కల మోదళ్ళల్లో మెటలాక్సిల్ (లేదా) మాంకోజెబ్ 5 గ్రాములు లీటరు నీటిలో కలుపుకొని పోసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ ఉన్న 4-5 మొక్కలకు వరుసల్లో పాదులను ముంపుగా తడపటం వలన దుంపకుళ్ళు తెగులు ఉదృతిని తగ్గించవచ్చు.


తమలపాకు సాగు విధానం, నేలలు, ఎరువులు, సస్యరక్షణ, నీటి యాజమాన్యం మరియు దిగుబడి

          తమలపాకులను ఆయుర్వేదంలో కఫ, వాత, నోటి దుర్వాసన నివారణిగా, జీర్ణకారిణిగా వాడుతారు. తమలపాకులలో ఉండే నూనెకు యాంటిసెప్టిక్ గుణాలు కలవు. 

వాతావరణం:
          గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండి భూమిలో తగినంత తేమ కలిగిన ఉష్ణమండల ప్రాంతాలు తమలపాకు తోటలకు బాగా అనువైనవి. సంవత్సర వర్షపాతం 750 ml నుండి 1500 ml కలిగి ఉండి 10 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉన్న ప్రాంతాలలో ఆకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. వేడి గాలులు వీచే ప్రాంతాలలో తీగ చివరలు ఎండిపోయి ఆ తర్వాత తీగ అంతా చనిపోతుంది. 
నేలలు:
           మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న సారవంతమైన భూములు ఆకు తోటలకు అనుకూలమైనవి. మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న నల్ల రేగడి భూములలో కూడా తమలపాకుల సాగు చేసుకోవచ్చు. మురికి నీటి సౌకర్యం లేని భూములు, అధిక ఆమ్ల లేదా క్షారగుణం ఉన్న భూములు తమలపాకు తోటకు అనుకూలం కాదు. 
తమలపాకు రకాలు: 
           తమలపాకులో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. అవి కపూరి, బంగ్లా, మీఠా. 
కపూరి: మన రాష్ట్రంలో ఎక్కువగా కపూరి రకాలను పండిస్తారు. వీటిలో స్వర్ణ కపూరి, తెల్లాకు-పొన్నూరు, తెల్లాక-కడప, కూలజేడు కడప రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. వీటి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, మృదువుగా ఉంటాయి. ఈ రకపు తీగలకు కవటలు ఎక్కువగా ఉండి అధిక దిగుబడిని ఇస్తాయి. 
బంగ్లా: ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి ఘాటుగా ఉంటాయి. వీటిలో కవటలు తక్కువగా ఉండటం వలన తక్కువ దిగుబడి ఇస్తాయి. కారపాకు, కకేర్, గోడి బంగ్లా, నవ బంగ్లా వంటి రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. 
మీఠా: ఈ ఆకులు తీపిగా ఉండి మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఆకులు ముదురాకు పచ్చగా ఉండి తక్కువ కవటలతో తక్కువ దిగుబడినిస్తాయి. దీనినే కలకత్తా మీఠా పాన్ అని కూడా పిలుస్తారు. ఈ రకం మొక్కల సాగుకు ఎక్కువ నీడని కల్పించవలసి ఉంటుంది. 
తమలపాకు సాగు / నాటుట: 
         భూమిని బాగా దున్ని సమం చేసి ఎకరాకు 16 నుంచి 20 కిలోల అవిస విత్తనాలను సాలుకు సాలుకు ఒక మీటర్ దూరం ఉండే విధంగా ఒత్తుగా విత్తుకోవాలి. విత్తనాలను ఉత్తరం నుండి దక్షిణం దిక్కుకు మాత్రమే విత్తుకోవాలి. విత్తిన రెండు నెలల తర్వాత సాళ్ల మధ్య మట్టిని చెక్కి ఆ మట్టిని అవిసె మొదళ్ళ వద్ద వేసి కయ్యలు చేసి వాటి మధ్య 50 సెంటీమీటర్ల లోతు 20 సెంటీమీటర్ల పొడవు 10 సెంటీమీటర్ల వెడల్పు గల గుంతలను 20 సెంటీమీటర్ల ఎడంతో తీసి ఎకరాకు 20,000 తమలపాకు తీగలను ఎన్నుకొని తీగలను నాటే ముందు 0.5% బోర్డో మిశ్రమం, 500 ppm స్ట్రెప్టో సైక్లిన్ మిశ్రమంలో 15 నుంచి 20 నిమిషాల పాటు తీగలను ముంచి శుద్ధి చేసుకోవాలి. నాటే ప్రతి తీగకు 6 నుంచి 8 కణుపులు ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. 2 నుంచి 3 కణుపులు నేలలోకి వెళ్లే విధంగా విత్తనపు తీగలను నాటుకోవాలి. నాటడానికి ముందుగానే నీరు పెట్టే కాలువలు, మురుగునీరు పోయే కాలువలు చేసుకోవాలి. చలి మరియు ఎండాకాలాల్లో తోట చుట్టూ గాలులు సోకకుండా దడులు కట్టుకోవాలి. 
నీటి యాజమాన్యం: 
          తీగలు నాటిన అప్పటి నుంచి మూడు రోజుల వరకు రెండు పూటలా నీరు పెట్టాలి. తర్వాత మూడురోజులకు ఒక పూట అంటే సాయంకాలం మాత్రమే నీటిని కట్టవలెను. తర్వాత రోజు మార్చి రోజు 15 నుంచి 20 రోజుల వరకు నీటిని కట్టవలెను. డ్రిప్ ద్వారా నీటి తడులు ఇచ్చుకోవడం వల్ల నీటి అదా చేయడమే కాక మొదలు కుళ్ళు తీవ్రతను తగ్గించుకోవచ్చు. 
తీగలు పాకించుట: 
          చిగురించిన తీగలు పెరగడం మొదలైన 5 రోజులకు జమ్ముతో అవిస మొక్కలకు కట్టి పాకించాలి. ఈ పనిని ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి. అవిసె 4 మీటర్లు పెరిగిన తరువాత తలను తుంచి, ఎత్తుపెరగకుండా, చెట్టు బలమయ్యేటట్లు చూసుకోవాలి. 
ఎరువులు: 
          తీగ నాటే ముందు దుక్కిలో ఒక ఎకరాకు 40 బండ్ల పశువుల ఎరువు 40 కిలోల సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం, 40 కిలోల పొటాష్ (మ్యురేట్ అఫ్ పోటాష్ రూపంలో) ను కలిపి వేయాలి. తీగ నాటిన రెండు నెలల నుండి సంవత్సరానికి నత్రజనిని ఎకరాకు 80 కిలోల వేప పిండి, యూరియా 1:1 నిష్పత్తిలో నాలుగు నుండి ఆరు దఫాలుగా అందించాలి. ఒక ఎకరాకు ఒక టన్ను చొప్పున జిప్సం వేసుకోవచ్చు. 
దింపకం వేయుట: 
          తమలపాకు తీగలు 4 నుంచి 5 మీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ఆకులు కోయడం కష్టమవుతుంది, కాబట్టి తీగను అవిశ కాండం నుంచి వేరు చేసి దిగువన ఉన్న ఆకులు, కొమ్మలు తీసివేసి తీగను చుట్టగా చుట్టి నేలకు తగిలేటట్లుగా ఉంచి చివర 50 సెంటీమీటర్ల పొడవున్న తీగ భాగాన్ని అవిశ మొక్కలకు కట్టి పాకనివ్వాలి. దీనినే దింపకం అంటారు. తొలి దింపకాల తర్వాత తోటలను “కోడే తోట” అంటారు. కోడే తోటలను కూడా మరల కొన్ని నెలల తరువాత దింపకం వేయాలి. రెండవసారి దింపకం వేసిన తోటను “ముది తోట” అని అంటారు. 
ఆకుల కోత, దిగుబడి:
           తీగ నాటిన రెండు నెలలకు ఆకులు కోతకు వస్తాయి. ఆ తర్వాత ప్రతి నెల ఆకులకు ఇనుప గోరు సహాయంతో కోయాలి. కోసిన ఆకులను పంతములుగా అమర్చి తడిగుడ్డ అమర్చిన వెదురు బుట్టలో పెట్టుకుని మార్కెట్ కు తీసుకెళ్లాలి. (పంతం అంటే 100 ఆకులు అని అర్థం). మొదటి సంవత్సరం మొక్క తోటల (కోడే తోట) నుండి ఎకరాకు 20 వేల నుండి 40 వేల పంతాలు వస్తాయి మరియు రెండవ సంవత్సరం (ముది తోట) 40 వేల పంతాలు దిగుబడి వస్తుంది.మూడవ సంవత్సరం తోటలో దాదాపు కోడే తోటతో సమానంగా దిగుబడి వచ్చినప్పటికీ ఆకు పరిమాణం తగ్గి మార్కెట్లో మంచి ధర పలకదు.


Monday, January 8, 2024

వరి నారుమడిలో ఆశించే పురుగులు

          సాధారణంగా వరి నారు మడిలో కాండం తొలిచే పురుగులు, తాటాకు (హిస్పా) తెగులు, ఉల్లికోడు, తామర పురుగులు, నారు కత్తిరించే లద్దె పురుగులు ఆశించి ఎక్కువ నష్టం కలుగ చేస్తాయి. కావున సకాలం లో ఈ పురుగుల ఉనికిని ఉదృతిని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టి నారు మడి లో అధిక దిగుబడి సాధించవచ్చు. 


కాండం తొలిచే పురుగులు: 
        తల్లి రెక్కల పురుగులు పసుపు రంగులో ఉండి ముందు రెక్కల మీద నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. ఈ పురుగులు వరి ఆకుల చివరి భాగాలలో గ్రుడ్లను పెట్టి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పి ఉంచుతాయి. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు కాండం లోపలి రంధ్రం చేసుకొని వెళ్లి కణజాలాన్ని తింటూ కాండాన్ని తొలిచివేస్తాయి. దీని వల్ల మొవ్వు చనిపోవటంతో పాటు ఆకులు ఎండిపోతాయి. నారుమడి దశలోనే సస్యరక్షణా చర్యలు చేపట్టకపోతే ఇవి ప్రధాన పొలాన్ని ఆశించి తీవ్ర నష్టాన్నికలుగచేస్తాయి. కనుక ప్రధాన పొలంలో నారు నాటుకొనేటప్పుడు ఆకుల చివర్లు త్రుంచి నాటుకోవాలి. 

          ఈ పురుగుల నివారణకు ఒక చదరపు మీటరు నారుమడికి ఒక గ్రుడ్ల సముదాయము (లేదా) ఒక తల్లి రెక్కల పురుగు గమనించినట్లయితే 2.5 మి.లీ క్లోరోపైరిఫాస్ (లేదా) 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 2 గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ (లేదా) 2.5 మి.లీ క్లోరంట్రానిలిప్రోల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా నారు తీయటానికి వారం రోజుల ముందు పలుచటి నీటి తడి ఇచ్చి 160 గ్రా. కార్బోఫ్యూరాన్ ౩G గుళికలు సెంటు నారుమడిలో వేసుకొన్నట్లయితే నారు మడిలోనే పురుగును నాశనం చేయవచ్చు. 

హిస్పా (తాటాకు) తెగులు: 
          ఈ పురుగులు పెంకు పురుగుల్లాగా నలుపు రంగులో ఉండి శరీరం మీద ముళ్ళు కలిగి ఉంటాయి. పిల్ల పురుగులు ఆకుపొరల మధ్యలోకి చొచ్చుకొనిపోయి పత్రహరితాన్ని గోకి తినటంవల్ల ఆకుల మీద తెల్లటి మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు ఎండిపోతాయి. దూరం నుంచి చూస్తే ఈ పురుగు ఆశించిన నారుమడి ఎండిపోయినట్లు తాటాకుల్లాగా కనిపిస్తాయి. ఈ పురుగులు వరితో పాటుగా పొలంగట్ల మీద ఉండే గడ్డిజాతి మొక్కలను కూడా ఆశిస్తాయి. పొలంలో పంటలేనప్పుడు కలుపు మొక్కల మీద ఆశ్రయం పొంది పంట వేసిన తరువాత వరి పంటను ఆశించి నష్టం కలుగచేస్తాయి. కనుక, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ప్రధాన పొలంలో నారు నాటేటప్పుడు ఆకుల చివర్లు కత్తిరించడం ద్వారా పురుగు ప్రధాన పొలాన్ని ఆశించకుండా కాపాడుకోవచ్చు. దీని నివారణకు 2.0 మి.లీ ప్రాఫెనోఫాస్ (లేదా) 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ (లేదా) 2.5 మి.లీ క్లోరోపైరిఫాస్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

ఉల్లికోడు: 

          ఈ పురుగులు ఎరుపు రంగులో ఉండి దోమల లాగా ఉంటాయి. ఇవి ఆకు తొడిమెలమీద గ్రుడ్లు పెడతాయి. వాటి నుండి వచ్చిన పిల్ల పురుగులు మొక్క అంకురం భాగాన్ని ఆశించి దానికి నష్టం కలుగచేస్తాయి. దీనితో పాటుగా కొన్ని రకాల రసాయన పదార్థాలను విడుదల చేయటం వల్ల అంకురం ఆకులాగా వృద్ధి చెందకుండా పొడవాటి గొట్టంలా మార్పు చెంది ఉల్లికోడులా బయటకు వస్తుంది. ఒక చదరపు మీటరుకు ఒక ఉల్లికోడు సోకిన పిలక గమనించిన వెంటనే సెంటు నారుమడికి 160 గ్రా. కార్బోఫ్యూరాన్ ౩G గుళికలు వేసుకోవాలి.

తామర పురుగులు: 
          మెట్ట నారుమళ్లలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి, పిల్ల పురుగులు ఆకుల అంచుల నుండి రసాన్ని పీల్చటం వాళ్ళ ఆకుల అంచులు పైకి చుట్టుకొనిపోతాయి. దీని నివారణకు 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ (లేదా) 2.0 మి.లీ ఫిప్రోనిల్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 

నారు కత్తిరించే లద్దె పురుగులు: 
          ఈ లద్దె పురుగులు పగటి వేళల్లో మొక్క మొదళ్ల దగ్గర దాగి ఉండి రాత్రి వేళలో నారును కత్తిరించినట్లుగా కొరికి తింటాయి. దీని వలన నారుమడి పశువులు మేసినట్లుగా కనిపిస్తుంది. దీని నివారణకు నారుమడిని నీతితో నింపడం వలన లోపల ఉన్న పురుగులు బయటకు వస్తాయి. నీటిపై తేలుతున్న పురుగులను పక్షులు తిని కొంతవరకు నాశనం చేస్తాయి. దీనితో పాటు 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ (లేదా) 2.5 మి.లీ క్లోరోపైరిఫాస్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Friday, December 22, 2023

బంగాళా దుంప సాగు, యాజమాన్య పద్ధతులు, విత్తన రకాలు


      బంగాళదుంప మొక్కలు సొలనేసి కుటుంబానికి చెందినవి. బంగాళదుంప శాస్త్రీయ నామం "సొలానమ్ ట్యూబరోసమ్".
          బంగాళదుంప మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రదేశాలలో, విశాఖపట్నం జిల్లాలోని అరకు చింతపల్లి మొదలగు కొండ ప్రాంతాలలో చల్లని ప్రదేశాలలో మాత్రమే పండిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకములను సిమ్లా లోని కేంద్రీయ బంగాళాదుంప పరిశోధనా సంస్థ వారు రూపొందించారు. అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే బంగాళాదుంప రకాలు వాటి దిగుబడి వివరాలు: 
1.కుఫ్రి సూర్య: ఈ రకం పంటకాలం 90 రోజులు, దుంప కోలాకారంగా గోధుమ రంగులో ఉంటాయి. వీటి కండ లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ రకం దుంపలను అధిక నాణ్యత కలిగిన చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కూడా వాడవచ్చు. ఈ రకం బంగాళాదుంప ఆకులు ఎండు తెగులు, నల్లి తెగులు, దీపపు పురుగులను తట్టుకుంటుంది. ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 
2.కుఫ్రి లీమా: ఈ రకం పంటకాలం 90 రోజులు, దుంప కోలాకారంగా తెల్లగా ఉంటాయి. వీటి కండ లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ రకం బంగాళాదుంప నల్లి, దీపపు పురుగులను తట్టుకుంటుంది. ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 
3.కుఫ్రి ఉదయ్: ఈ రకం దుంపలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటి కండ పసుపు రంగులో ఉంటుంది. ఈ బంగాళాదుంప ఆకులు ఎండు తెగులును తట్టుకుంటుంది. ఎకరానికి 12-15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇసుక పాలు ఎక్కువగా ఉండే సారవంతమైన తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలలో కొద్దిపాటి ఆమ్ల గుణం ఉంటే మంచిది. దుంపలను నాటే ముందు పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు దున్ని గుల్ల పరచాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు ఇవి కాకుండా ట్రైకోడెర్మా, పాస్పో బ్యాక్టీరియా , సూడోమోనాస్, అజోస్పైరిల్లం, అజాటోబాక్టర్ వంటి జీవన ఎరువులు, జీవన శిలీంద్ర నాశనులను సిఫార్సు మేరకు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. 
విత్తన దుంపలు: విత్తనం కోసం వాడే దుంపలు వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా తెగుళ్లు సోకని ప్రదేశాల్లో ప్రత్యేకంగా పండించిన వాటిని మాత్రమే వాడాలి. పంజాబ్ రాష్ట్రంలో ఏరో ఫోనిక్స్ విధానంలో విత్తన దుంపలను పండిస్తున్నారు. 30 నుండి 40 గ్రాముల బరువు ఉన్న మొలకలు కలిగిన దుంపలను మాత్రమే విత్తన దుంపలు గా వాడాలి. విత్తనాన్ని నాటడానికి ముందు మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ (లీటరు నీటికి 3 గ్రాముల మందు) కలిపిన నీటిలో ముంచి 5 నిమిషముల తర్వాత బయటకు తీసి ఆరబెట్టాలి. బోదెల మధ్య దూరం 60 cm ఉండేలాగా చూసుకోవాలి. సాళ్లలో దుంపలను 20cm దూరంలో వేసుకుని మట్టితో కప్పుకోవాలి. అక్టోబర్ చివరి వారం నుండి నవంబర్ మొదటివారం వరకు బంగాళదుంప నాటుకోవడానికి అనుకూలమైన సమయం. 
మట్టిని ఎగదోయడం:
        బంగాళదుంప సాగులో బోదెల పైకి మట్టిని ఎగదోయడం చాలా ముఖ్యమైనది. దుంపలు మొలకెత్తిన 20 రోజులకు ఒకసారి తర్వాత 30 రోజులకు ఒకసారి కలుపు తీసి పై పాటు ఎరువులు వేసి మట్టిని ఎగదోయాలి. ఇలా చేయడం వలన దుంపలు బాగా వృద్ధి చెందుతాయి. ఇలా చేయకపోతే దుంపలకు సూర్య రశ్మి తగిలి ఆకుపచ్చగా మారుతాయి. ఇటువంటి దుంపలకు మార్కెట్లో డిమాండ్ ఉండదు, అంతేకాకుండా ఇవి విషతుల్యం కూడా..,, 
దుంపల తవ్వకం: విత్తనం నాటిన నుంచి సుమారు 90 రోజులకు దుంపలను తవ్వుకోవచ్చు. దుంపలను తవ్వటానికి 10 రోజుల ముందు నీటి తడిని ఆపి వేయాలి. మొక్కలను వేట కొడవళ్లతో కోసి బోదెలపై వదిలివేయాలి. దీని వలన దుంపల పై సూర్యరశ్మి పడదు. మొక్కలను కోసిన తరువాత దుంపలను 10 రోజులు భూమిలోనే వదిలివేయాలి. దీని వలన దుంపలపై చర్మం గట్టిపడుతుంది. లేకపోతె చర్మం పొరలు పొరలుగా ఊడిపోతుంది. పది రోజుల తర్వాత దుంపలను నాగళ్లతో కానీ ట్రాక్టర్లతో కానీ కొన్ని తీయవచ్చు. తవ్విన దుంపలను నీడలో ఆరవేయాలి. సైజును బట్టి గ్రేడింగ్ చేసి గోనె సంచుల్లో నింపుకోవాలి.
@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates