LATEST UPDATES

Friday, December 22, 2023

బంగాళా దుంప సాగు, యాజమాన్య పద్ధతులు, విత్తన రకాలు


      బంగాళదుంప మొక్కలు సొలనేసి కుటుంబానికి చెందినవి. బంగాళదుంప శాస్త్రీయ నామం "సొలానమ్ ట్యూబరోసమ్".
          బంగాళదుంప మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రదేశాలలో, విశాఖపట్నం జిల్లాలోని అరకు చింతపల్లి మొదలగు కొండ ప్రాంతాలలో చల్లని ప్రదేశాలలో మాత్రమే పండిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకములను సిమ్లా లోని కేంద్రీయ బంగాళాదుంప పరిశోధనా సంస్థ వారు రూపొందించారు. అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే బంగాళాదుంప రకాలు వాటి దిగుబడి వివరాలు: 
1.కుఫ్రి సూర్య: ఈ రకం పంటకాలం 90 రోజులు, దుంప కోలాకారంగా గోధుమ రంగులో ఉంటాయి. వీటి కండ లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ రకం దుంపలను అధిక నాణ్యత కలిగిన చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి కూడా వాడవచ్చు. ఈ రకం బంగాళాదుంప ఆకులు ఎండు తెగులు, నల్లి తెగులు, దీపపు పురుగులను తట్టుకుంటుంది. ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 
2.కుఫ్రి లీమా: ఈ రకం పంటకాలం 90 రోజులు, దుంప కోలాకారంగా తెల్లగా ఉంటాయి. వీటి కండ లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ రకం బంగాళాదుంప నల్లి, దీపపు పురుగులను తట్టుకుంటుంది. ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 
3.కుఫ్రి ఉదయ్: ఈ రకం దుంపలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటి కండ పసుపు రంగులో ఉంటుంది. ఈ బంగాళాదుంప ఆకులు ఎండు తెగులును తట్టుకుంటుంది. ఎకరానికి 12-15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇసుక పాలు ఎక్కువగా ఉండే సారవంతమైన తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలలో కొద్దిపాటి ఆమ్ల గుణం ఉంటే మంచిది. దుంపలను నాటే ముందు పొలాన్ని మూడు నుంచి నాలుగు సార్లు దున్ని గుల్ల పరచాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు ఇవి కాకుండా ట్రైకోడెర్మా, పాస్పో బ్యాక్టీరియా , సూడోమోనాస్, అజోస్పైరిల్లం, అజాటోబాక్టర్ వంటి జీవన ఎరువులు, జీవన శిలీంద్ర నాశనులను సిఫార్సు మేరకు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. 
విత్తన దుంపలు: విత్తనం కోసం వాడే దుంపలు వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా తెగుళ్లు సోకని ప్రదేశాల్లో ప్రత్యేకంగా పండించిన వాటిని మాత్రమే వాడాలి. పంజాబ్ రాష్ట్రంలో ఏరో ఫోనిక్స్ విధానంలో విత్తన దుంపలను పండిస్తున్నారు. 30 నుండి 40 గ్రాముల బరువు ఉన్న మొలకలు కలిగిన దుంపలను మాత్రమే విత్తన దుంపలు గా వాడాలి. విత్తనాన్ని నాటడానికి ముందు మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ (లీటరు నీటికి 3 గ్రాముల మందు) కలిపిన నీటిలో ముంచి 5 నిమిషముల తర్వాత బయటకు తీసి ఆరబెట్టాలి. బోదెల మధ్య దూరం 60 cm ఉండేలాగా చూసుకోవాలి. సాళ్లలో దుంపలను 20cm దూరంలో వేసుకుని మట్టితో కప్పుకోవాలి. అక్టోబర్ చివరి వారం నుండి నవంబర్ మొదటివారం వరకు బంగాళదుంప నాటుకోవడానికి అనుకూలమైన సమయం. 
మట్టిని ఎగదోయడం:
        బంగాళదుంప సాగులో బోదెల పైకి మట్టిని ఎగదోయడం చాలా ముఖ్యమైనది. దుంపలు మొలకెత్తిన 20 రోజులకు ఒకసారి తర్వాత 30 రోజులకు ఒకసారి కలుపు తీసి పై పాటు ఎరువులు వేసి మట్టిని ఎగదోయాలి. ఇలా చేయడం వలన దుంపలు బాగా వృద్ధి చెందుతాయి. ఇలా చేయకపోతే దుంపలకు సూర్య రశ్మి తగిలి ఆకుపచ్చగా మారుతాయి. ఇటువంటి దుంపలకు మార్కెట్లో డిమాండ్ ఉండదు, అంతేకాకుండా ఇవి విషతుల్యం కూడా..,, 
దుంపల తవ్వకం: విత్తనం నాటిన నుంచి సుమారు 90 రోజులకు దుంపలను తవ్వుకోవచ్చు. దుంపలను తవ్వటానికి 10 రోజుల ముందు నీటి తడిని ఆపి వేయాలి. మొక్కలను వేట కొడవళ్లతో కోసి బోదెలపై వదిలివేయాలి. దీని వలన దుంపల పై సూర్యరశ్మి పడదు. మొక్కలను కోసిన తరువాత దుంపలను 10 రోజులు భూమిలోనే వదిలివేయాలి. దీని వలన దుంపలపై చర్మం గట్టిపడుతుంది. లేకపోతె చర్మం పొరలు పొరలుగా ఊడిపోతుంది. పది రోజుల తర్వాత దుంపలను నాగళ్లతో కానీ ట్రాక్టర్లతో కానీ కొన్ని తీయవచ్చు. తవ్విన దుంపలను నీడలో ఆరవేయాలి. సైజును బట్టి గ్రేడింగ్ చేసి గోనె సంచుల్లో నింపుకోవాలి.

Tuesday, December 19, 2023

సీతాఫలం అద్భుత పోషకం

      వర్షాకాలం లో ఎక్కువ గా దొరికే ఫలాల్లో సీతాఫలం ఒకటి. ఇందులో నోరూరించే రుచే కాదు .. ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి. మరెన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.  పిల్లల నుంచి పెద్దల వరకు.. సీతాఫలాన్ని ఎంతగానో ఇష్టపడతారు.


            సీతాఫలంలో విటమిన్ "ఏ" పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాదు చర్మం, కురులను ఆరోగ్యంగా ఉంచుతుంది. 


      ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే మెగ్నీషియం, సోడియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని ఇతర పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కరిగించి మంచి కొవ్వులను వృద్ధి చేస్తాయి. కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. 

             దీనిలోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది, మహిళల్లో రక్తహీనతను నివారిస్తుంది. ఎనీమియాకు అడ్డుకట్ట వేస్తుంది. 

        విటమిన్ బి కడుపు ఉబ్బరాన్ని, అజీర్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా నెలసరి అసౌకర్యానికి ఇది చక్కని మందుగా పనిచేస్తుంది. సీతాఫలం అల్సర్‌లను నయం చేయడంలో సహాయపడుతుంది మరియు అసిడిటీని నివారిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.


                 పీసీఓఎస్‌ ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యతతో నీరసం, చిరాకు వంటివి అదనం. ఈ పండును రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఈ సమస్యలన్నీ తొలగుతాయి. మహిళల్లో గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. దీనిలోని పీచు గర్భిణీల్లో మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు వికారం వాంతులను తగ్గిస్తాయి. గర్భిణీ స్త్రీలు సీతాఫలాన్ని తినడం వల్ల కడుపులో పెరుగుతున్న శిశువు మెదడు, నాడీ వ్యవస్థ మరియు రోగనిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది.

                సీతాఫలంలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక రకాల కణతులను క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి. ఆల్కలాయిడ్లు, అసిటోజెన్లు ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తాయి. 

         100 గ్రాముల సీతాఫలంతో 94 కేలరీల శక్తి లభిస్తుంది. అదే జామలో అయితే 49, ఆపిల్ లో 56, బొప్పాయిలో 32, మామిడిలో 70 క్యాలరీలు ఉంటాయి. దీనిని బట్టి ఈ పండ్లతో పోలిస్తే సీతాఫలం ఎంత మంచిదో ఇట్టే తెలుసుకోవచ్చు. 

        సన్నగా ఉన్నవారు ఇది తింటే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదు. నీరసంగా ఉన్నప్పుడు ఒక పండు తింటే వెంటనే శక్తి వస్తుంది. అర్థరాయిడ్ లక్షణాలను నివారిస్తుంది.


గమనిక: ఈ వివరాలు ఆరోగ్య నిపుణులు మరియు అధ్యయనాల ప్రకారం అందించబడ్డాయి. ఈ వ్యాసం మీ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates